“నటనలో  అభివృద్ధి  కానరాని  చిత్రరంగం”

గతానికున్న  ప్రభావం తక్కువదేమీ  కాదు. గతం  వర్తమానాన్ని నడిపిస్తుంది. నా దృష్టిలో  గతించిన  రోజులెప్పుడూ  చాలా  విలువైనవి,  వెల  కట్టలేనివీను.  సినిమా  అంటే  చిత్రమైనది.  సినిమా  జీవుల జీవితాలు  ఇంకా  చిత్రమైనవి.

నేను 1950 మే 17న  శ్రీ దోనేపూడి  కృష్టమూర్తి  ద్వారా  చిత్రరంగంలో ప్రవేశించాను.  అప్పటికి  పరిశ్రమ  నాలాంటి  భయస్థులకు  మరీ భయం, భయంగా  ఉండేది.  నేను చిత్రరంగంలో  ప్రవేశించే సరికే  శ్రీమతి  కన్నాంబ,  భానుమతి , శాంతకుమారి, అంజలీదేవి . జి. వరలక్ష్మి, జూనియర్  శ్రీరంజని , మాలతి , లక్ష్మిరాజ్యం , శ్రీయుతులు, రామారావు, నాగేశ్వరరావు, రంగరావు, సి. యస్. ఆర్. ముక్కామల, లింగమూర్తి , డాక్టర్  గోవిందరాజులు  సుబ్బారావుగార్లు  తెలుగు  సినీపరిశ్రమలో  లబ్ద  ప్రతిష్టులై  ప్రేక్షకాభిమానులుగా  వెలుగుతున్నారు.

నా మొదటి  చిత్రం శ్రీ ఎల్. వి ప్రసాద్ గారి దైనాకాని , పి. పుల్లయ్య,  సి పుల్లయ్య . కె. వి రెడ్డి, బి.  యన్ . రెడ్డి. తాతినేని ప్రకాశరావు , కె . యస్ ప్రకాశ  రావు , ఎస్ , ఎస్ , వాసన్ , బి అర్ . పంతులు వంటి  ప్రఖ్యాత దర్శకుల వద్ద నటించాను. వీరంతా  క్రమశిక్షణకు  బద్దులైన  దర్శకులు  తమ  వృత్తిమీద , కళమీద  అమితమైన  విశ్వాసం. దీక్ష కలవారు. తమకు  సంబంధించిన   శాఖలో  ప్రాముఖ్యం చూపించటమే  గాక , సాంకేతిక  నిపుణులందరూ  ఒకటిగా చర్చించుకుని ఒక విధానాన్ని  నిర్ణయించుకున్న తరువాతే నిర్మాణ రంగంలోకి  దిగేవారు. ఈ దర్శకులకు  తలకో పద్దతీ  ఉండేది.  కొందరు  నటనకు  ప్రాముఖ్యతనిచ్చి పాత్రల స్వభావాన్ని  ప్రేక్షకులకు తేలిగ్గా  అర్థమయ్యే పద్దతిలో  తీర్చిదిద్దేవారు.  కొందరి  దర్శకత్వం  చిత్రంలో  దర్శకుని  ప్రతిభ  మాత్రమే కొట్టొచ్చినట్టు  కనిపించేలా ఉండేది.  దాదాపు  ఇప్పుడూ  ఇవే  పద్దతుల్లో  చిత్రరంగం  నడుస్తోందని  చెప్పాలి.

ఒక దశాబ్దంలో  వచ్చిన మంచి  చిత్రాలు

ఇంకా ఆ చిత్రాల  గురించి  చెప్పాలంటే అవి ఎక్కువ నాటకీయతను  కలిగి  ఉండేవనిపిస్తుంది  నాకు. చిత్రాలు చాలా నెమ్మదిగా  నడిచేవి.  అలాగే  ఎక్కువ నిడివి  కలిగి  ఉండేవి. ప్రేక్షకుడు  పాత్రల స్వభావాల  గురించిగాని  చిత్రంలోని  అంశం గురించిగాని  ఆలోచించటానికి  శ్రమపడ  నక్కర్లేదు.  అరటిపండు  వలచినట్టు చెప్పే  వాడు దర్శకుడు.నటీనటులకు   మాటలు  కంఠతా  పట్టటం , రిహార్పలుకోసం  ప్రత్యేకంగా  సమయాన్ని  ఎక్కువగా  వినియోగించాల్సి ఉండేది.  ఇప్పుడు నటీనటులకు   ఒక సుఖమిది . ఇక ఇప్పటి  చిత్రాల తీరు తెన్నులు  అందరూ  చూస్తున్నవే . ఇప్పుడు  బాగా  చిత్రరంగంలో  స్పీడ్  పెరిగింది. ఇది ఎంతవరకు  పోతుందో  చెప్పలేం. నా ఉద్దేశ్యంలో 1952 నుంచి 1965 వరకూ మనకు  మంచిచిత్రాలు  వచ్చాయని  చెప్పాలి. నైతిక విలువలు కానీయండి, సాంకేతిక విలువలు  కానీయండి, అప్పుడే  అన్ని  విధాలా బాగున్నాయని  నా ఉద్దేశ్యం . ఆ రోజుల్లో అంటే  నా  చిత్రరంగ  ప్రవేశానికి  ముందు  ఎవరి  పాటలు , ఎవరి  మాటలు వారే  చెప్పేవారు. నేను  చిత్రరంగం లోకి  వచ్చాక  కూడా  కొందరు  నటీనటులు  ఎరువు  కంఠాలకు  అంగీకరించేవారు  కాదు.  అప్పటికి  ప్లేబ్యాక్  పద్ధతి , ఛాయా గ్రహణంలో  చాలా అభివృద్ధి   వచ్చింది.  నేను  నవరాత్రిలో  మట్టుకు  వీదిభాగవతం  పాట పాడాను.

నాటికంటే   నేడు వచ్చిన అభివృద్దిని ఒక్కమాటలో  చెప్పాలంటే  నటనలో తప్ప చిత్రరంగం చాలా  వృద్దిలోకి  వచ్చింది. శక్తిగలవారు   కూడా  కాలం తోపాటు  దిగజారిపోతున్నారనిపిస్తోంది